జూన్ 3, 24/7 తెలుగు న్యూస్:శత్రు దేశాల గూఢచారి మిత్రులు
ఒకరిది భారత్, మరొకరిది పాకిస్తాన్. ఒకరిది ‘రా’, ఇంకొకరిది ‘ఐఎస్ఐ.’ వారిద్దరూ ఒకప్పుడు వైరి దేశాల గూఢచార సంస్థల అధిపతులు. ఇద్దరూ కలిసి తాజాగా ‘కోవర్ట్: ద సైకాలజీ ఆఫ్ వార్ అండ్ పీస్’ అనే పుస్తకం రాశారు. వాళ్లమధ్య అసలీ స్నేహం ఎలా మొదలైంది? ఇంతకీ ఈ పుస్తకంలో ఏం ఉంది? చాలానే ఉన్నాయి. గూఢచారి అధినేతల ఆంతరంగిక జీవితాలు, ప్రేరణలు, అంతర్లీన మానసిక స్థితుల అన్వేషణ అది. అంతేకాదు, భారత్–పాక్ దేశాల శాంతి సాధనకు తమ తమ దేశాల పట్ల చిన్నపాటి అవిధేయ సంకేతం కూడా లేకుండా వారు ముందుకు వెళ్లిన మనోహరమైన విధానం కూడా పుస్తకంలో కనిపిస్తుంది.
బహుశా జాన్ లి కరే(గూఢచర్య కథాంశాల బ్రిటన్ రచయిత) కూడా దీనినొక ఏమాత్రం నమ్మదగని అసంభవంగా భావించి ఉండేవారు. సి.ఐ.ఎ.(అమెరికా నిఘా సంస్థ), కె.జి.బి.(రష్యా నిఘా సంస్థ)ల అధినేతలు కలిసి పని చేసేందుకు ఒక అంగీకారానికి రావటమే ఇది. కానీ నమ్మేందుకు కష్టంగా ఉన్నా, దక్షిణాసియాలో ఇటువంటిదే ఒకటి ఇంకా ఎవరూ గుర్తించకుండా, ఎవరి గమనింపునకూ రాకుండా సంభవించింది. భారత్–పాకిస్తాన్ల గూఢచారి సంస్థలైన ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్), ఐ.ఎస్.ఐ. (ఇంటర్–సర్వీసెస్ ఇంటిలిజెన్స్)ల మాజీ అధిపతులు స్నేహితులుగా మారి తాము ఉమ్మడిగా కలిసి రాసిన పుస్తకాలకు పరస్పరం సహకరించుకున్నారు. అమర్జీత్ సింగ్ దులత్, జనరల్ అసద్ దుర్రానీ తమ తాజా పుస్తకం ‘కోవర్ట్: ద సైకాలజీ ఆఫ్ వార్ అండ్ పీస్’ను ఈ నెలలో ఆవిష్కరించారు (నీల్ క్రిషణ్ అగర్వాల్ మరో సహ రచయిత). వారి మొదటి పుస్తకానికి ‘ద స్పై క్రానికల్స్’ అని సముచితమైన పేరే పెట్టారు.
ఈ అనుబంధం ఎలా మొదలైంది? చూస్తుంటే బ్యాంకాక్లోని ఛావ్ ప్రాయా నదిపై ఒక చిన్న నౌకలో మొదలైనట్లుంది. ఉగ్రవాదంపై ఒక అనధికార చర్చా కార్యక్రమానికి వాళ్లిద్దరూ ఆ నౌకలోని ఆహ్వానితులు. దులత్ని మాట్లాడమని ఆహ్వానించారు. ఇలాంటి చర్చా కార్యక్రమాలకు ఆయన కొత్త కనుక సంకోచంగా, అనాసక్తిగా ఉండిపోయారు. దుర్రానీ ఆ సంగతి గమనించి దులత్కు మద్దతుగా నిలిచారు. ఆ సందర్భం గురించి దులత్… తమ మధ్య ‘కెమిస్ట్రీ’ కుదిరిందని అంటారు. ఆ తర్వాత అనతికాలంలోనే వారిద్దరూ స్నేహితులైపోయారు.
‘కోవర్ట్’ పుస్తకం ఆ ఇద్దరి మధ్య సారూప్యాలను, వైరుధ్యాలను వెల్లడిస్తుంది. చిన్నతనంలో దుర్రానీ ‘‘ఎల్లప్పుడూ ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడేవారు’’. పెద్దయ్యాక కూడా ‘‘సమూహంలో భాగం కావాలని కోరుకోలేదు’’. చిన్నవాడిగా ఉన్నప్పుడు దులత్కు కొద్ది మంది స్నేహితులు ఉండేవారు. వారిలో ‘‘ఎక్కువగా పనివాళ్ల పిల్లలు’’. ఆయన మాటల్లోనే చెప్పాలంటే… ‘‘తనకై తను ఉండగలగటం, తనను తను కాపాడుకోవటం నేర్చుకున్నారు’’.
ఇక భవిష్యత్తు ఐఎస్ఐ చీఫ్… స్కూల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచేవాడు. ‘‘నేను ఎల్లప్పుడూ దాదాపు ప్రతి సబ్జెక్టులో మొదటి నలుగురు లేదా ఐదుగురిలో ఒకరిగా ఉండేవాడిని’’ అంటారాయన. దులత్ అందుకు విరుద్ధం. ఆయన ‘‘చాలా సగటు విద్యార్థి’’. కానీ ఈ భవిష్యత్తు ‘రా’ అధిపతి క్రీడల్లో తన తఢాకా చూపించారు. స్కూల్లో ఆయన ‘‘ప్రతి ఆటా ఆడాడు’’.
ఒంటరి దుర్రానీకి ‘‘సైక్లింగ్ అంటే చాలా ఇష్టం’’. కానీ ‘‘లాహోర్ వంటి నగరంలో సైకిల్ తొక్కేందుకు దూరపు స్థలం ఉండేది కాదు’’.
వ్యక్తిగతంగా దుర్రానీ ఎలా ఉండేవారో, అలాంటి వ్యక్తిగానే ఆయన ఎదగటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ‘‘నేను భిన్నం, నేను నాలా ఉండే స్వభావం నాది’’, ‘‘నా గుణం ఎప్పుడూ కూడా కాస్త తిరుగుబాటు ధోరణితో ఉంటుంది’’ అంటారు దుర్రానీ. దులత్ ప్రధానంగా తల్లిదండ్రుల మాట వినటానికీ, విద్యాబుద్ధులు నేర్పిన క్రమశిక్షణ ప్రకారం నడచుకోటానికీ సిద్ధంగా ఉంటారు. ‘‘తగిన పనులు, తగని పనులు అని ఉంటాయి’’ అనే నమ్మకంతో ఆయన పెరిగాడు. ఇది ఆయనకు స్పష్టమైన నైతిక దిశా నిర్దేశం చేసిందని నేను అనుకుంటాను.
దుర్రానీ సైన్యంలో చేరారు. ‘‘ఆ కారణంగా నేనెప్పుడైనా పశ్చాత్తాపం చెందానని నేను అనుకోను’’ అంటారు. దులత్ పోలీస్ అయ్యారు. ఎందుకంటే, ‘‘అంతకన్నా మెరుగైన సర్వీసులలోకి వెళ్లలేకపోయాను’’ అని ఆయన అంగీకరిస్తారు. అయితే యాదృచ్ఛికమో లేదా అనుకోని అదృష్టమో ఇద్దరూ కూడా ఇంటిలిజెన్స్ సంస్థల వైపు మళ్లారు.