జూన్ 3, 24/7 తెలుగు న్యూస్:నేటి నుంచి టోల్ బాదుడు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఛార్జీలు మూడు నుంచి ఐదు శాతం సోమవారం నుంచి పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేసిన కేంద్రం ఎన్నికలు ముగియడంతో ఈ నెల 3 నుంచి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో టోల్ ఛార్జీలు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా సవరిస్తున్నారు. సోమవారం నుండి దాదాపు 1,100 టోల్ ప్లాజాల వద్ద పెంచిన ఛార్జీలను వసూలు చేయనున్నట్లు హైవే ఆపరేటర్లు ఇప్పటికే వార్తా పత్రికల్లో నోటీసులిచ్చారు. ”ఎన్నికల ప్రక్రియ ముగిసినందున, ఎన్నికల సమయంలో నిలిపివేసిన వినియోగదారు రుసుము రేట్ల సవరణ జూన్ 3 నుండి అమలులోకి వస్తుంది” అని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని సీనియర్ అధికారి రాయిటర్స్తో చెప్పారు. వార్షిక ఛార్జీల పెంపును ప్రతిపక్ష పార్టీలు, వాహనదారులు విమర్శిస్తున్నారు, అవి నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు, ప్రయాణికులపై భారాన్ని పెంచుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, అశోక్ బిల్డ్కాన్ లిమిటెడ్ వంటి ఆపరేటర్లు టోల్ పెంపు వల్ల భారీగా లాభాలు పొందుతుండగా, సామాన్యులపై ఈ పెంపు తీవ్ర ప్రభావం చూపుతోంది. 2018-19లో టోల్ వసూళ్లు రూ.2,520 కోట్లు ఉండగా, 2022-23 నాటికి రూ.5,400 కోట్లకు పెరిగింది.




