కుట్లు అల్లికలు మహిళలకు మంచి ఉపాధి అవకాశాలు చూపిస్తాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 19వ వార్డు అరుంధతి కళ్యాణ మండపంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్, రెయిన్బో స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని హరీష్ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకునేందుకు, జీవనోపాధి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుపరస్తుందన్నారు. సెట్విన్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది మహిళలకు కుట్లు అల్లికలు మగ్గం వర్క్ బ్యూటీషన్ వంటి రంగాలలో శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించిందని గుర్తు చేశారు. పట్టణంలో 19వ వార్డులో శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నందుకు రెయిన్బో స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రజితను అభినందించారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలందరికీ ప్రభుత్వం ద్వారానే ఉచితంగా కుట్టుమిషన్లు అందజేస్తామని మంత్రి తెలిపారు. ఈ శిక్షణ శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, వార్డు కౌన్సిలర్ గ్యాదరి రవీందర్, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




