ముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ఫిబ్రవరి 1, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృడసంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గంభీరావుపేట్ లో నిర్మించిన KG to PG క్యాంపస్ ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఆరు ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈక్యాంపస్ లో ఆధునిక తరగతి గదులు, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, అత్యాధునిక ప్రమాణాలతో కూడిన క్రీడా మైదానం ఏర్పాటు చేశారు. అనంతరం ఇరువురు నేతలు క్యాంపస్లో కలియతిరిగారు. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీతోపాటు వివిధ విభాగాలను పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 పాఠశాలలను కూడా ప్రారంభించనున్నారు. ఈక్యాంపస్ గంభీరావుపేటలో రూపుదిద్దుకున్నది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒకే చోట కేజీ టూ పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ, చేసుకొని కార్పొరేట్ సంస్థల సహకారంతో గంభీరావుపేటలో ఆరెకరాల విస్తీర్ణంలో ఆధునిక సముదాయం నిర్మాణమైంది. రహేజా కార్ప్ ఫౌండేషన్, మైండ్స్పేస్ రిట్, యశోద హాస్పిటల్, ఎమ్మార్ఎఫ్, డీవీస్ ల్యాబ్, గివ్ తెలంగాణ, గ్రీన్కో సహకారంతో 3కోట్లతో సకల వసతులతో దీనిని నిర్మించారు. మొత్తం 70 తరగతి గదుల్లో 3500 మంది తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో అభ్యసించేందుకు ఆధునిక హంగులతో ఎడ్యుకేషన్ హబ్లా నిర్మాణాలు పూర్తి చేశారు. 250 మంది చిన్నారులకు సరిపడేలా అంగన్వాడీ కేంద్రం.. చిన్నారులకు ప్రీ ప్రైమరీ, క్రీడా మైదానంతో పాటు ప్రైమరీ, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలతో పాటు పీజీ కళాశాలకు అనుగుణంగా భవన సముదాయాలు సిద్ధం చేశారు. అంతే కాకుండా ప్రాంగణంలో డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం, వెయ్యి మంది ఒకే సారి కూర్చొని తినేలా డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, జెల్లా వెంకటస్వామి, కొమ్ము బాలయ్య, కుర్ర సావిత్రి, విజయ రామారావు ముస్తాబాద్ మండల కేంద్రం నుండి పలువురు ప్రజా ప్రతినిధులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.




