
ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు విద్యుత్ వైర్ల కింద చెట్లు
-పంచాయతీ రాజ్ శాఖ మొక్కలు నాటితే విద్యుత్ శాఖ చెట్లను కొట్టేస్తుంది
-రెండు ప్రభుత్వ శాఖలు పని చేసేది ప్రజల మేలు కోసమే
ఎల్లారెడ్డిపేట: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వనమాహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుంటే ఆ కార్యక్రమం ఎల్లారెడ్డిపేట మండలంలో అపహాస్యం పాలవుతుంది.మండలంలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించుటకు ఉపాధిహామీ కూలీలచే గుంతలు తీపిస్తున్నారు.ఈ క్రమంలో విద్యుత్తు వైర్ల కింద మొక్కలు నాటడానికి గుంతలు తీస్తున్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపమా లేక అధికారుల నిర్లక్ష్యమా తెలియదు కానీ ప్రజాధనం వృధా అవడమే కాకుండా విద్యుత్ లైన్ల కింద ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలు విద్యుత్తు తీగలకు తగిలి తరచూ ప్రమాదాలు సంభవించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ మొక్కలు నాటడం విద్యుత్ శాఖ చెట్లను తొలగించడం గత ప్రభుత్వ హరితహారం కార్యక్రమం నుండి ప్రస్తుత ప్రభుత్వ వన మహోత్సవ కార్యక్రమం వరకు జరుగుతూనే ఉంది.అయినను తిరిగి మొక్కలు నాటే కార్యక్రమానికి విద్యుత్తు లైన్ల కింద గుంతలు తీయడం అధికారుల నిర్లక్ష్యమేనని, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపమేనని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇట్టి విషయం ఎంపీఓ గౌరీశంకర్ దృష్టికి తీసుకెళ్లగా విద్యుత్తు లైన్ల కింద మొక్కలు నాటకుండా మండల వ్యాప్తంగా చర్యలు చేపడతామని మొక్కలను రక్షిస్తామని తెలిపారు.





