డ్రగ్స్ సమాచారాన్ని పోలీసులకు అందించాలి.
యాంటీ డ్రగ్ సోల్జర్స్ గా ముందుకు రండి.
మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు.
TS తెలుగు న్యూస్ 24/7: జూన్ 22 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన వారోత్సవ కార్యక్రమాల్లో భాగంగా,జూన్ 26న నిర్వహించనున్న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ఇంటర్నేషనల్ డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల ఎస్పీ ఆదేశాల మేరకు మంగళ వారం ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలోని ఏకలవ్య మోడల్ స్కూల్ నందు ఎల్లారెడ్డిపేట ఎస్సై రజాక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మత్తు పదార్థాలు మొదట్లో ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ,తరువాత అవి వ్యసనంగా మారి వ్యక్తి ఆరోగ్యం,భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తాయని హెచ్చరించారు. మాదకద్రవ్యాల వల్ల శారీరక,మానసిక సమస్యలు తలెత్తడంతో పాటు కుటుంబాలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాయని ఎస్ ఐ తెలిపారు.అందువల్ల విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.పాఠశాల ప్రాంగణాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని,అలాగే సమాజంలో ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి యాంటీ డ్రగ్ సోల్జర్స్ గా ముందుకు రావాలని కోరారు.జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కష్టపడి పనిచేయాలని విద్యార్థులకు సూచించారు.క్రమశిక్షణ,అంకితభావం,నిరంతర శ్రమతోనే ఉన్నతాధికారులు,క్రీడాకారులు, కళాకారులు,నాయకులుగా ఎదగగలరని అన్నారు. లక్ష్యంపై దృష్టి సారించి కృషి చేస్తే ప్రతి విద్యార్థి జీవితంలో విజయాన్ని సాధించగలడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట కానిస్టేబుల్ అరవింద్, బాబయ్య,పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.






