సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నూతన కోర్టు భవనం అలాగే సబ్ కోర్టు నిర్మించాలని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి మాట్లాడుతూ గతంలో నక్సలైట్లు కోర్టు భవనాన్ని పేల్చడం తో ప్రస్తుతం కోర్టు శిధిలావస్థకు గురై పెచ్చులు ఊడుతుందని తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని నూతన భవనాన్ని నిర్మించాలని అలాగే గజ్వేల్ కి సబ్ కోర్టు వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు. 2014 సంవత్సరంలో గజ్వేల్ అదనపు కోర్టు మంజూరు అయిందని, గజ్వేల్ ఎమ్మెల్యే కావడమే కాకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం సంతోషకరమన్నారు. గజ్వేల్ హైదరాబాద్ కు అందుబాటులో ఉండడం తో భూముల రేట్లు రెట్టింతలు పెరగడంతో కేసుల సంఖ్య పెరిగిందన్నారు. దీంతో పాటు సబ్ కోర్టు, నూతన భవనం నిర్మించి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు సుదర్శన్, నరేష్ చారి, హరి శంకర్, గోపాలరావు, రమణ, కిరణ్ సాగర్, రాజు, స్వామి, ప్రశాంత్, కాళీ ప్రసాద్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.




