– ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్
దౌల్తాబాద్: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ గంగాధరి సంధ్య రవీందర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. అనంతరం పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, ఇందుప్రియల్ ఎంపీటీసీ వీరమ్మ మల్లేశం లు మాట్లాడుతూ అంగన్ వాడి కార్యకర్తలు బాధ్యతలు మరిచి రాజకీయాలు చేస్తున్నారని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను ప్రతిరోజు పర్యవేక్షించాలని కోరారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు యాసంగి సాగు కోసం కాలువలను పూర్తి చేసి చెరువులకు నీళ్లు అందించి రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. సూరంపల్లి, గాజులపల్లి సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో మహిళా గ్రూపులకు మూడుసార్లు లోను ఇస్తున్నారని మహిళలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొనగా ఏపిఎం కిషన్ సమస్యను త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయ పొలాల్లో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేయాలని తెలుపగా విద్యుత్ ఏఈ వాసుదేవరావు స్తంభాలను త్వరలో ఏర్పాటు చేస్తానని తెలిపారు. జనవరితో సర్పంచ్ ల పదవి ముగిస్తుండడంతో గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల నిధులను త్వరగా అందేటట్లు చూడాలని ఎంపీపీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేష్ కుమార్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు రహీముద్దీన్, ఎంపీఓ సయ్యద్ గపూర్ ఖాద్రి, వ్యవసాయ అధికారి గోవిందరాజు, అంగన్ వాడీ సూపర్వైజర్లు అనురాధ, గిరిజ ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు….




