దౌల్తాబాద్: నవభారత నిర్మాత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించినప్పుడే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 67 వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత దేశానికి అర్థమైంది ఒక విధానం, ప్రపంచ దేశాలకు అర్థమైంది ఒక విధానం అన్నారు. ప్రపంచం మొత్తం అంబేద్కర్ ను విజ్ఞాన భాండాగారంగా ప్రపంచ నాయకుడిగా చూస్తే భారత దేశంలో మాత్రం కొన్ని వర్గాలకే పరిమితం చేశారు. అంబేద్కర్ అంటే కొందరి వాడు కాదని, అంబేద్కర్ అంటే అందరి వాడన్నారు. ప్రజలు కూడా అంబేద్కర్ సిద్ధాంతాలను ఆశయాలను పూర్తిగా తెలుసుకోవాలని అంబేద్కర్ అంటే కేవలం భారత రాజ్యాంగం, రిజర్వేషన్లు మాత్రమే అనుకుంటారు. కానీ అంబేడ్కర్ దేశంలోని ప్రతి సమస్య మీద పోరాటం చేశారని ప్రజాస్వామ్యం, లౌకికవాదం, కార్మికుల యాజమాన్య హక్కులు, ప్రజలందరికీ సమాన భూమిపై హక్కులు, మహిళా హక్కులు, ఆర్థిక వ్యవస్థ, మానవ హక్కులు ఇలా ప్రతి అంశం మీద పోరాటం చేసిన ఘనత అంబేద్కర్ గారిది అన్నారు. జయంతి, వర్ధంతి రెండు రోజులలో మాత్రమే పూలమాలలు వేసి ఆర్భాటాలు చేయడం కాదని ఆయన ఆశయాలను సాధించినప్పుడే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళని అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఇంతియాజ్ బాబా తదితరులు పాల్గొన్నారు.




