దౌల్తాబాద్ : ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని లింగరాజుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మహంకాళి నాగరాజు (25) కిరాణ దుకాణం నడిపిస్తున్నాడు . సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగరాజు ఉరేసుకుని మృతి చెందాడు. మృతుని సోదరుడు సాయంత్రం ఇంటికి వచ్చి చూసి కిందికి దింపగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. ప్రేమించిన అమ్మాయితో వివాహం జరగదేమోనన్న భయంతో తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని మృతుని అన్న సాయికృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే తన తమ్ముడిని ఎవరైనా బెదిరించి ఉండవచ్చని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. మృతుని అన్న సాయి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.




