సిరిసిల్ల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో సంస్థాగత ప్రసవాలను పెంచేందుకు వైద్యాధికారులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
గురువారం జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రులలో సంస్థాగత, సాధారణ ప్రసవాలు , ఆరోగ్య మహిళా కార్యక్రమం, టీబీ పరీక్షల పురోగతి పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మెడికల్ ఆఫీసర్ లు, స్టాఫ్ నర్స్ లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 24 గంటలు పని చేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖచ్చితంగా డెలివరీల సంఖ్యను పెంచాలన్నారు. రిస్క్ ఉన్న కేసులను జిల్లా ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రి లకు పంపాలని చెప్పారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో భాగంగా గుర్తించిన అనుమానిత క్యాన్సర్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వారిని జిల్లా ఆసుపత్రి కి రిఫరల్ చేస్తూ ఖచ్చితంగా పరీక్షలు చేసుకునేలా మానిటర్ చేయాలన్నారు. అనుమానిత బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి వారు తప్పనిసరిగా నిర్దారణ పరీక్షలు చేసుకునేలా చూడాలన్నారు.




