ప్రాంతీయం

వేములవాడ పట్టణంలో ప్రగతిలో ఉన్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్

208 Views

వేములవాడ పట్టణంలో ప్రగతిలో ఉన్న మినీ స్టేడియం, ఫుట్ పాత్, గ్రంథాలయ నిర్మాణ పనుల్లో వేగం పెంచి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే విధంగా పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

 

బుధవారం ఆయన వేములవాడ పట్టణంలోని మినీ స్టేడియం, ఫుట్ పాత్ నిర్మాణం, గ్రంథాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని మున్సిపల్, సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

 

మొదటగా 5 కోట్ల రూపాయలతో చేపడుతున్న మినీ స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ పనులు ఆశించినంత వేగంగా జరగట్లేదని, నిర్దిష్ట ప్రణాళిక సిద్ధం చేసుకుని పనులు వేగవంతంగా పూర్తయ్యేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాక్ ఏర్పాటుకు సంబంధించి హైదరాబాద్ లో గల అత్యాధునిక స్టేడియాలను సందర్శించి, అదే రీతిలో ఇక్కడ ఏర్పాటు చేసేలా చూడాలని అన్నారు. ఆర్చ్ నిర్మాణం, ఫ్లోరింగ్, తదితర పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

 

అనంతరం మల్లారం జంక్షన్ నుండి కోరుట్ల బస్టాండ్ వరకు 2 కోట్ల 37 లక్షల రూపాయలతో ప్రధాన రహదారికి ఇరువైపులా చేపట్టిన ఫుట్ పాత్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటేందుకు గుంతలు తీయాలని అన్నారు. వచ్చే వారం రోజుల్లోగా తుది దశ పనులు పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

 

చివరగా తహశీల్దార్ కార్యాలయ సమీపంలో పాఠకుల సౌకర్యార్థం 1 కోటి 45 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్ నిర్దేశిత గడువు దసరా పండుగ లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు.

 

సందర్శనలో కలెక్టర్ వెంట టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఈఈ అనిత సింగనాథ్, పంచాయితీ రాజ్ ఈఈ సూర్య ప్రకాష్, మున్సిపల్ కమీషనర్ అన్వేష్, డీఈఈ తిరుపతి, ఏఈ లు, తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *