-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్*
-9 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు*
-నవంబర్ 16 న 12 ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల*
-రాజకీయ పార్టీలతో చర్చించి పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు పంపాలి*
-కరోనా నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ప్రతిపాదించిన నియమాలను పాటించాలి*
-స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి*
పారదర్శకంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, దీనికి సంబంధించి కార్యచరణ రుపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై బుధవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. తెలంగాణలో ఉన్న 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసిందని, నవంబర్ 16న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆయన తెలిపారు. నవంబర్ 16 నుండి నవంబర్ 23 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందని, డిసెంబర్ 10న పోలింగ్ మరియు డిసెంబర్ 14న కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారని, వీరు మిగిలిన కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పకడ్భందిగా ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి 9 జిల్లాల పరిధిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని పకడ్భందీగా అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటర్లుగా ఎంపిటిసిలు, జడ్పీటిసిలు, కౌన్సిలర్లు, కార్పోరేటర్లు వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. పోలింగ్ నిర్వహణకు అనువైన కేంద్రాలను గుర్తించాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల జాబితా ఫైనల్ చేసి పంపాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, జిల్లాల వారిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల జాబితా పంపాలని ఆయన అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ తో నిర్వహిస్తామని, బ్యాలెట్ బాక్సులను సిద్దం చేసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలో పకడ్బందీగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని అన్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను జారీ చేసిందని, వాటిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సమయంలోను అమలు చేయాలని ఆయన తెలిపారు. హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల సమయంలో అమలు చేసిన విధానాలను యథావిధంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రచారం నిర్వహించాలని, అంతర్గత సమావేశాలకు 200 మంది, బహిరంగ ప్రదేశాలకు 500 కంటే అధికంగా ప్రజలు హజరుకావద్దని, బైక్ ర్యాలీ, కార్ల ర్యాలీలకు అనుమతి ఉండదని, ఇంటిటి క్యాంపేన్ 5 మంది, వీడియో వ్యాన్ క్యాంపెన్ 50 మంది, 72 గంటల ముందుగానే ప్రచారం నిలిపివేయాలని అధికారులకు సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి , కరోనా మార్గదర్శకాల పై అవగాహన కల్పించాలని సిఈఒ ఆదేశించారు. ఎన్నికల సమయంలో నియమాలను పాటిస్తు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచారం చేసుకునే విధంగా వారికి ముందస్తుగా అనుమతులు జారీ చేసేందుకు అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ బి.కె. రాహుల్ హెగ్డే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, జెడ్పీ సీఈవో గౌతం రెడ్డి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమీషనర్లు సమ్మయ్య, శ్యామ్ సుందర్ రావు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం నాయబ్ తహశీల్దార్ రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.
