జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్టు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్రటరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ హరీష్ రావు, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ జీవన్ రెడ్డి, శ్రీ బాల్క సుమన్, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, సీఎస్ శ్రీమతి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.