ఎస్టీ నిరుద్యోగులకు ఉచిత శిక్షణకై ఆన్లైన్ లో దరఖాస్తులకు ఆహ్వానం :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*
రాజన్న సిరిసిల్ల, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ ఏప్రిల్ 02:
జిల్లాలోని నిరుద్యోగ ఎస్టీ (షెడ్యూల్డ్ తెగలు) యువతీ, యువకులు ప్రభుత్వం భర్తీ చేయబోయే పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఉచిత శిక్షణ అందించడం జరుగుతుందని, దీనికోసం అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులచే దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భర్తీ అయ్యే పోలీస్, గ్రూప్-1, గ్రూప్-4 ఉద్యోగాల కొరకు త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో మన జిల్లాలో 100 మంది ఎస్టీ నిరుద్యోగులకు ఉచితంగా సంబంధిత పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించిందని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలో ఈ శిక్షణ వచ్చే మే 1వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని ఆయన తెలిపారు. గ్రూప్-4 అభ్యర్థులు కనీసం డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలని, 18 సంవత్సరాల నుండి 47 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలని, కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలని ఆయన అన్నారు. ప్రభుత్వముచే నిర్వహించబడుచున్న ఇతర శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొంది ఉన్నచో, లేదా ఉద్యోగం చేసేవారు, వేరే కోర్సులలో ఉన్నవారిని ఈ శిక్షణకు అనర్హులుగా పరిగణించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 4 వ తేదీ నుండి 11 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు https://studycircle.cgg.gov.in/tstw అనే వెబ్ సైట్ లో తమ దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.




