
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గా జగదేవ్ పూర్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ను ప్రభుత్వం నియమించింది. ఈ నెల 11వ తేదీన జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవనంలో జరిగే జయంతి వేడుకల నిర్వహణకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ ను ఉత్సవాల కమిటీ చైర్మన్ గా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని ఆయా సంఘాలకు చెందిన సుమారు రెండు వందల ప్రతినిధులను జయంతి ఉత్సవాల కమిటీ నిర్వాహకులుగా నియమించింది. ఈ సందర్భంగా మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాల రాష్ట్ర కో-ఆర్డినేటర్ గా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర మంత్రులు టి.హరీష్ రావుకు కెటిఆర్ కు గంగుల కమలాకర్ కు ఎమ్మల్సీ బస్వరాజు సారయ్యకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. గత కొన్ని నెలల క్రితం చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల కమిటీ కన్వీనర్ గా ఉత్సవాలను అద్బుతమైన తరహాలో నిర్వహించిన స్పూర్తితో జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాలను కూడా అదేస్థాయిలో నిర్వహించడానికి తనశాయశక్తులా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. కాగా జ్యోతిరావుపూలే జయంతి వేడుకల రాష్ట్ర కో-ఆర్డినేటర్ గా నియమితులైన రజక మండల అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ కు మండల రజక నాయకులు, కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు.




