వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వంటగ్యాను సిలిండర్ ధరలను 500 రూపాయలు దాటనివ్వమని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెఱుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని ముత్యంపేట్, గోవిందాపూర్ గ్రామాల్లో శనివారం హత్ సే హాథ్ జోడో దుబ్బాక నియోజకవర్గ ఆత్మ గౌరవ యాత్ర చేపట్టారు. ఆయన మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రతినిత్యం ధరలు పెంచి ఆయన దోస్త్ అయినా ఆదానిని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చేశాడని శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవ చేశాడు. భారతదేశంలోని పెట్రోల్ డీజిల్ ధరలనే పెంచడం కాకుండా, మహిళలు ప్రతినిత్యం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరను నరేంద్ర మోడీ నేటి నుండి మరో 50 రూపాయలు పెంచారు. వ్యాపారవేత్తలు హోటల్లు, ఫంక్షన్లలో వినియోగించే సిలిండర్ ధరలు మాత్రం మరో 350 రూపాయలు పెంచారని అసహనం వ్యక్తం చేశారు. మోడీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని. హామీఇచ్చి ఇప్పటికీ ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతుందని, ఈ 8 సంవత్సరాల కాలంలో 16కోట్ల ఉద్యోగాలను చూపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలోని మధ్యతరగతి కుటుంబాల జీవన స్థితిగతులు కోలుకోలేని విధంగా బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచి అదాని అంబానీ లాంటి వారికి మాత్రం బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ ప్రపంచంలోనే అత్యంత కుబేరులుగా చేశారని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో 4లక్షల కోట్ల అప్పులు చేసి కాంట్రాక్టర్ల పేర్ల పైన కమిషన్ తీసుకొని వారి కుటుంబంలోని కవిత, కేటీఆర్ ను, హరీష్ రావును బలోపేతం చేశాడని ఎద్దేవ చేశారు. కేసీఆర్ అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చి హామీలన్నీ తుంగలో తొక్కాడని, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్, రైతుల రుణమాఫీ, పింఛన్ల మంజూరు లాంటి ఎన్నో పథకాలకు తూట్లు పొడిచారని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారుల్లోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెఱుకు శ్రీనివాస్ రెడ్డి రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నది సరిపోలేదని, కేసీఆర్ మరో నాటకం ఆడడానికి తెరలేపి బీఆర్ఎస్ గా అవతరించి దేశాన్ని మరోసారి దోచుకోవడానికి భారీ స్కెచ్ వేశాడని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కర్నాల శ్రీనివాస్ రావు, మండల అధ్యక్షులు దశరథ్ రెడ్డి, పడాల రాములు, మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి, బండారు లాలు, సూరంపల్లి ప్రవీణ్, పడాల మల్లేశం, పంజా రమేష్, రమేష్, యాదవ రెడ్డి, శ్రీను, నవీన్, ప్రసాద్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
