ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జెడ్పీటీసీ రణం జ్యోతి మండిపడ్డారు. ఇందుకు కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనమన్నారు. రణం జ్యోతి మాట్లాడుతూ, బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి కేంద్రం కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించిందని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల బడ్జెట్లో ఇదే అతి తక్కువ అని విమర్శించారు.
2020-21లో రూ 1,10,000 కోట్లు, 2021-22లో రూ. 98,000కోట్లు, 2022-23లో రూ.89,400కోట్లు, 2023-24లో కేవలం 60వేల కోట్లు కేటాయించి, దశల వారీగా ఉపాధి హామీ పథకానికి బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు.ఉపాధి హామీ పథకం అమలుకు కనీసం రూ.2.72 లక్షల కోట్లు అవసరం ఉండగా, బడ్జెట్ లో కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించడం దేనికి సంకేతమని ఈ సందర్భంగా జ్యోతి ప్రశ్నించారు. గత తొమ్మిదేళ్లలో గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించని బిజెపి ప్రభుత్వం, ఉన్న ఉపాధి కార్యక్రమాలను సైతం అమలు చేయడం లేదని విమర్శించారు.ప్రజలకు వీలైనంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహకరించడం లేదని ఈ సందర్భంగా ఆమె మండిపడ్డారు.




