రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్-
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని రేషన్ దుకాణాన్ని సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కలిసి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.
రేషన్ దుకాణంలో ఉన్న మౌలిక వసతులను పరిశీలించారు. ప్రభుత్వం ద్వారా అందించబడుతున్న సరుకుల వివరాలు, దుకాణంలో ఉన్న రేషన్ కార్డుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ-పాస్ మెషిన్ పని తీరు, డిజిటల్ లావాదేవీల వివరాలపై ఆరా తీశారు.
పోర్టబిలిటీ విధానం ద్వారా రేషన్ సరుకుల పంపిణీ, వన్ నేషన్ – వన్ రేషన్, తదితర పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేసారు. ప్రభుత్వం నుండి వచ్చే సరుకులను నాణ్యతా లోపం లేకుండా వినియోగదారులకు సకాలంలో పంపిణీ చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి ఎస్.జితేందర్ రెడ్డి తహసిల్దార్ సదానందం, తదితరులు పాల్గొన్నారు.
రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి*
తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్, బద్దెనపల్లి గ్రామాల శివారులో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు.
అంకుసాపూర్, బద్దెనపల్లి గ్రామాల శివారులో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణాల పురోగతిని సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.
అసంపూర్తిగా ఉన్న పనులన్నీ త్వరతగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులను కలెక్టర్ ఆదేశించారు.
తదనంతరం ఇందిరమ్మ కాలనీలో పర్యటించిన కలెక్టర్ ఓటు హక్కు నమోదు చేసుకున్న వారి ఇంటికి వెళ్ళి వారి వివరాలు సరిగా ఉన్నాయా లేదా అని స్వయంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఇంఛార్జి డీఆర్ఓ టి.శ్రీనివాస రావు, తహసిల్దార్ సదానందం, ఎన్నికల విభాగం ఉప తహశీల్దార్ రెహమాన్, తదితరులు ఉన్నారు.
