
వినాయక చవితి ఉత్సవాలను
భక్తిశ్రద్ధలతో,శాంతియుత వాతావరణంలో నిర్వహించుకుందాం.సిరిసిల్ల డిఎస్పి కే. నాగేంద్ర చారి.
TS తెలుగు న్యూస్ 24 /7: ఎల్లారెడ్డిపేట: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో,శాంతియుతంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించాలని సిరిసిల్ల డీఎస్పి కే.నాగేంద్రచారి సూచించారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలంలోని సాయి శివ గార్డెన్ లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు,మండప నిర్వాహకులు,స్థానిక ప్రజా ప్రతినిధులతో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు.డీఎస్పీ నాగేంద్రాచారి మాట్లాడుతూ ప్రతీ వినాయక మండపాల నిర్వాహకులు,గణేష్ పోర్టల్–2026లో తమ మండపానికి సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని,ప్రజా రవాణాకు,అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మండపాలన్నింటినీ జియో ట్యాగింగ్ చేసి,టీజీ-కాప్ పోర్టల్లో అప్లోడ్ చేస్తామని తెలిపారు. జియోట్యాగింగ్ ద్వారా సంబంధిత ఎస్హెచ్ఓ లు మండపాల వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వీలుంటుందన్నారు.వినాయక విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు సూచించిన నిబంధనలను ప్రతీ ఒక్కరూ కచ్చితంగా పాటించాలని,శోభాయాత్ర సమయంలో పోలీస్ శాఖ రూపొందించిన రూట్ మ్యాప్ను తప్పనిసరిగా అనుసరించాలని తెలిపారు.ఉత్సవాల్లో మండపాలు, శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని, అనుమతి లేకుండా డీజేలు వినియోగిస్తే నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాత్రి పది గంటల వరకు రెండు చిన్న స్పీకర్లకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.
షోషల్ మీడియా పై పోలీస్ నిఘా ఉంటుంది
షోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు,వాస్తవాలు నిర్ధారించుకోకుండా వాటిని ఫార్వర్డ్ చేసే వారిపై ప్రత్యేక నిఘా ఉండి,క్రిమినల్ కేసులు నమోదు చేస్తమని హెచ్చరించారు.విద్యుత్ శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, విద్యుత్ షార్ట్ సర్క్యూట్,అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలి.అవసరమైన ప్రదేశాల్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచాలన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను సంతోషకర వాతావరణంలో నిర్వహించుకునేలా పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని,ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే డయల్-112కు లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని సూచించారు.ఈ సమావేశంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఓ వెంకటేష్,ఎల్లారెడ్డిపేట ఎస్సై ఎన్.రమేష్ మండపాల నిర్వాహకులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.





