*మంచిర్యాల జిల్లా*
స్వాతంత్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివి.రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు.
ఆగస్టు 15, 2026:
భారతదేశ స్వాతంత్ర సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్ లతో కలిసి హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతం, తెలంగాణ గీతాలాపనలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి సందేశాన్ని అందించారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. జిల్లాలోని 892 స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన 100 కోట్ల 10 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కును మంచిర్యాల జిల్లా సమాఖ్య సభ్యులకు అందజేశారు. పి.ఎం.ఎఫ్.ఎం.ఈ. పథకంలో 18 మంది లబ్ధిదారులకు 46 లక్షల 72 వేల 346 రూపాయల చెక్కును అందజేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. వేడుకలకు హాజరైన అధికారులు, ప్రముఖులు, మీడియా, ప్రజల కొరకు గ్యాలరీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం ఇతర కార్యక్రమాల ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





