దుర్గం చెరువు ఆక్రమణకు సంబంధించిన తనపై వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “అక్కడ ఉన్న భూమి పూర్తిగా మాదే. ఆ భూమినే పార్కింగ్ అవసరాల కోసం ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆ భూమిని ఆక్షన్ ద్వారా చట్టబద్ధంగా మేమే కొనుగోలు చేశాం. సుమారు ఎనిమిదేళ్ల క్రితమే సంబంధిత అధికారులు టీడీఆర్ కూడా ఇచ్చారు. అక్కడ హీరో నందమూరి బాలకృష్ణకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా భూములు ఉన్నాయి. దుర్గం చెరువులో మేము ఐదు ఎకరాల భూమిని కబ్జా చేశామని కొందరు కావాలని కేసులు పెట్టించారు. అయితే ఆ ప్రాంతంలో మాకు గజం స్థలం కూడా లేదు, ప్రభుత్వానికి కూడా గజం స్థలం లేదు. అక్కడ సాధారణంగా ప్రజలు తమ వాహనాలను పార్కింగ్ చేస్తారు. ఖాళీ ప్రదేశంలో చెత్తను డంప్ చేస్తుంటారు. ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారని మా సిబ్బందికి ఫోన్ వచ్చింది. నేను స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలిస్తాను. ఆ పక్కన ఉన్న స్థలం నేను 2004లో కొనుగోలు చేశాను. అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని తెలిసిన వెంటనే ప్రభుత్వానికి తిరిగి అప్పగించాను. కావాలని నా మీద తప్పుడు కేసులు పెట్టారు. ఆరోపణలు చేసినవారి దగ్గర నిజమైన ఆధారాలు ఉంటే బహిర్గతం చేయాలి” అని ఆయన స్పష్టం చేశారు.





