రామగుండం
షీ టీమ్స్ ఆధ్వర్యంలో కిష్టంపేట పాఠశాలలో విద్యార్థులకు భద్రత, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్ పరిధిలోని షీ టీమ్స్ ఆధ్వర్యంలో సోమవారం చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిగత భద్రత,సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, రహదారి భద్రతపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్స్ సిబ్బంది మాట్లాడుతూ, మహిళలు,బాలికల భద్రతకు షీ టీమ్స్ నిరంతరం సేవలందిస్తున్నాయని తెలిపారు.షీ టీమ్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని,సైబర్ నేరాలకు సంబంధించిన మోసపూరిత సందేశాలు, అనుమానాస్పద లింకులు, అపరిచితుల ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అలాగే మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వివరించారు.ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు.
అత్యవసర పరిస్థితులు లేదా వేధింపులు ఎదురైన వెంటనే డయల్-100కు సమాచారం అందించాలని,అలాగే రామగుండం షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 8712659385లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ కానిస్టేబుళ్లు వనిత,సతీష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





