మతాలు వేరు.. మనసులు ఒక్కటే.. పాములపర్తిలో వికసించిన గ్రామ ఐక్యత
– మాజీ ఎంపీపీ పాండుగౌడ్
గజ్వేల్ నియోజకవర్గం,జూన్ 30 (ప్రజా ప్రతిభ):
గ్రామ బొడ్రాయి పండుగ సందర్భంగా మతసామరస్యం మరోసారి వెల్లివిరిసింది. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని పాములపర్తి గ్రామంలోని ముస్లిం మైనారిటీ సోదరులు పండుగ నిర్వహణకు తమ వంతు సహకారంగా రూ.11,000 నగదు చందాను మైనార్టీ నాయకులు అహ్మద్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ మాట్లాడుతూ, ఇటువంటి సంఘటనలు గ్రామ ఐక్యతకు, పరస్పర సోదరభావానికి ప్రతీకలని కొనియాడారు. కుల, మతాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి, గ్రామ శ్రేయస్సే అందరి లక్ష్యంగా ఉండాలన్నారు.గ్రామ దేవతలకు మొక్కులు సమర్పిస్తూ నిర్వహిస్తున్న బొడ్రాయి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక మాత్రమే కాకుండా, గ్రామ ప్రజలందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చే పవిత్ర వేడుకని పేర్కొన్నారు.గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మాట్లాడుతూ, “మన గ్రామ బలం మన ఐక్యతే. ఈ సోదరభావం, పరస్పర గౌరవం ఎల్లప్పుడూ కొనసాగాలని, గ్రామంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుభిక్షం నెలకొనాలని గ్రామ దేవతలను ప్రార్థిస్తున్నామన్నారు.
“మతాలు వేరు… మనసులు ఒక్కటే. గ్రామం కోసం అందరం కలిసి ముందుకు సాగుదాం” అనే సందేశంతో బొడ్రాయి పండుగ గ్రామ ఐక్యతకు ఆదర్శంగా నిలిచిందనీ పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో నాచారం గుట్ట మాజీ చైర్మన్ హరి పంతులు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మేకల కనకయ్య స్థానిక సర్పంచ్ భవాని బాలకిషన్ ఉపసర్పంచ్ సుధాకర్ గ్రామ పెద్దలు నరేందర్ రెడ్డి వార్డు సభ్యులు & బొడ్రాయి ఉత్సవ కమిటీ తదితరులు పాల్గొన్నారు.





