– తెలంగాణ తురక కాశ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) ప్రక్రియపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి, రాష్ట్రంలో 100 శాతం మ్యాపింగ్ పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ముస్లిం సమాజానికి చెందిన నిరుపేదలు, నిరక్షరాస్యులు మరియు అవగాహన లేని ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై సరైన సమాచారం లేకపోవడం వల్ల అమాయక ప్రజలు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో ప్రతి అర్హుడైన ఓటరు భాగస్వామి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ఎన్నికల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు మరియు సామాజిక సంఘాలు కలిసి ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని కోరారు.
గ్రామాలు, పట్టణ వార్డుల్లో ప్రత్యేక అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి, ఓటరు నమోదు, మ్యాపింగ్, క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలు వంటి అంశాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో సమాచారం అందించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క అర్హుడైన ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని సయ్యద్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు.





