*రామగుండం పోలీస్ కమిషనరేట్*
జైపూర్,ఇందారం ప్రాంతాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు
జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూర్ బస్ స్టాండ్,ఇందారం చౌరస్తా ప్రాంతం,ఆటో స్టాండ్ ప్రాంతం,పాన్ షాపులు,హోటళ్లు,టీ స్టాళ్లతో పాటు ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో జైపూర్ సీఐ నవీన్ కుమార్, ఎస్ఐ భీమేష్, మంచిర్యాల నార్కోటిక్ టీమ్, నార్కోటిక్ డాగ్ స్క్వాడ్తో కలిసి శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జైపూర్ సీఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి రహిత రామగుండం కమిషనరేట్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు.ముఖ్యంగా యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలను వినియోగించినా, విక్రయించినా నిర్భయంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలు,ప్రవర్తన, స్నేహితుల వివరాలు, అలవాట్లపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని సూచించారు.ఏవైనా అనుమానాస్పద విషయాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.ఈ సందర్భంగా పలు పాన్ షాపులు, హోటళ్లలో నార్కోటిక్ డాగ్ సహాయంతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నార్కోటిక్ టీమ్తో పాటు జైపూర్ పోలీసులు పాల్గొన్నారు.





