రామగుండం పోలీస్ కమిషనరేట్
ప్రజల భద్రతే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్
సమాజంలో జరుగుతున్న నేరాల అదుపునకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి అన్నారు.
గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వినోబా నగర్,రెల్లివాడ,లెనిన్ నగర్ ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాల యజమానులకు జరిమానాలు విధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఈ ప్రాంతంలో ఎక్కువ మంది యువత ఉన్నందున గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.అలాగే సైబర్ నేరాలు,సైబర్ మోసాలు,ఆన్లైన్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయవద్దని, ఓటీపీలు,బ్యాంక్ ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన సందేశాలు పంపడం, ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర పోస్టులు పెట్టడం ద్వారా మహిళలు, బాలికలను వేధింపులకు గురి చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నియంత్రణకు ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు పాటించాలని తెలిపారు.ప్రతి వాహనదారుడు తన వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్డుపైకి పంపవద్దని హెచ్చరించారు.వేసవి సెలవుల సందర్భంగా ఊర్లకు వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, విలువైన వస్తువులను ఇంట్లో వదిలివెళ్లవద్దని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని, ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.ప్రజల సంరక్షణ,భద్రత కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్టౌన్ ఎస్ఐలు రమేష్, మనోహర్,అనూష, ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్, అంతర్గాం ఎస్ఐ వెంకట స్వామి, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.





