రామగుండం పోలీస్ కమిషనరేట్
పెద్దపెల్లిలో మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన సదస్సు.
వేధింపులు, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎస్ఐ లావణ్య
రామగుండం సీపీ ఆదేశాల మేరకు పెద్దపెల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి జాగృతి మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఇన్చార్జ్ ఎస్ఐ లావణ్య పాల్గొని మహిళల భద్రత, బాలల రక్షణ,ఆన్లైన్ మోసాలు మరియు యాంటీ డ్రగ్స్పై అవగాహన కల్పించారు.మహిళల రక్షణ కోసం ప్రతిరోజూ బస్టాండ్లు, ప్రధాన చౌరస్తాలు, జనసమ్మర్థ ప్రాంతాలు,కళాశాలల వద్ద షీ టీమ్ నిరంతరం పహారా నిర్వహిస్తోందని తెలిపారు.ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థినులు భయపడకుండా 6303923700 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.అత్యాశకు లోనై సైబర్ నేరాలు,ఆన్లైన్ మోసాలు,లోన్ యాప్ల బారిన పడవద్దని సూచించారు. ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నా లేదా బెదిరింపులు ఎదురైనా వెంటనే 100 లేదా 112 నంబర్లకు డయల్ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక,స్నేహలత తదితరులు పాల్గొన్నారు.





