రామగుండం పోలీస్ కమిషనరేట్
విద్యార్థుల క్రమశిక్షణపై సీపీ ప్రశంసలు…రోడ్డు భద్రతపై అవగాహనతో భవిష్యత్కు బాటలు: సీపీ అంబర్ కిషోర్ ఝా
“అరైవ్ & అలైవ్” కార్యక్రమంతో విద్యార్థుల్లో ట్రాఫిక్ నియమాలపై చైతన్యం
రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్, జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జైపూర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో,జైపూర్ సీఐ నవీన్,ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన“అరైవ్ & అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల జోన్ డీసీపీ ఏ.భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు చూపుతున్న క్రమశిక్షణను అభినందించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నియమాలను నేర్చుకుని పాటించడం చాలా ముఖ్యమని తెలిపారు.విద్యార్థి దశలో అలవర్చుకున్న మంచి అలవాట్లు భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదగడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని, హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని సూచించారు.ఈ నియమాలను కేవలం మనమే పాటించడం కాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులకు కూడా వివరించి అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు.ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రాముఖ్యతను వివరించి,ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవించి పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం ద్వారా వ్యక్తిగతంగా, కుటుంబ స్థాయిలోనే కాకుండా సమాజం మరియు రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ట్రాఫిక్ నియమాలపై చిత్రాలు వేశారు.సీపీ, డీసీపీలు వాటిని పరిశీలించి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు పోస్టుకార్డు ద్వారా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,సీట్ బెల్ట్ వినియోగించాలని, ట్రాఫిక్ నియమాలను పాటించాలని, రహదారి క్రమశిక్షణతో ప్రవర్తించాలని తెలియజేస్తూ లేఖలు రాశారు.అదేవిధంగా ట్రాఫిక్ నియమాలు, రహదారి భద్రత నియమాలను పాటిస్తామని, కుటుంబ సభ్యులతో కూడా పాటించేలా చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.





