సిద్దిపేట, ఏప్రిల్ 13, తెలుగు న్యూస్ 24/7

రోడ్డు భద్రత నియమాలు పాటించండి – సురక్షిత ప్రయాణమే లక్ష్యం: జిల్లా కలెక్టర్ కె. హైమావతి,రోడ్డుపై ప్రయాణించే ప్రతి వాహనదారుడు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలని, అందుకోసం రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి పిలుపునిచ్చారు.సోమవారం కొండపాక మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగమైన “అరైవ్-అలైవ్” కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలోనే రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద ప్రతి వారం ఒక ప్రత్యేక థీమ్తో కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఈ నెల 13 నుండి 18 వరకు “రోడ్డు భద్రత వారంగా” అరైవ్-అలైవ్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. వాహనదారులు ఇంటి నుండి బయలుదేరి క్షేమంగా తిరిగి ఇంటికి చేరడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు.గ్రామస్థాయిలో రహదారి భద్రతను బలోపేతం చేసేందుకు సర్పంచ్, ఏఎన్ఎం, సమాఖ్య సభ్యులు, వార్డు సభ్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలు గ్రామాల్లో చెడు రహదారులను గుర్తించడం, రోడ్డుపక్కన ఉన్న చెట్లు, పొదలను తొలగించడం, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొంటూ, రెండు చక్రాల వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని హెచ్చరించారు.అధిక వేగం, ఓవర్లోడ్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘన వంటి చర్యలు ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిపారు. వాహనాలు సరిగా నిర్వహణలో ఉండాలని, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేశారు.రోడ్డు భద్రత నియమాలు ఉల్లంఘించిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రమాదాల సమయంలో టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సహాయం పొందవచ్చని, బాధితులను రక్షించిన వారికి ప్రభుత్వం ప్రోత్సాహక నగదు అందిస్తుందని తెలిపారు.ప్రతి కుటుంబంలో రహదారి భద్రతపై చర్చించి అవగాహన పెంపొందించుకోవాలని, ప్రమాదాలు నివారించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం “అరైవ్-అలైవ్” కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్టీఓ శంకర్ నారాయణ, గ్రామ సర్పంచ్ మంచాల నవీన, ఎంవీఐ, తహసీల్దార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.





