పారిశుధ్యం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి,జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య
మంచిర్యాల జిల్లా ,మార్చి 29, 2026:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. ఆదివారం జిల్లాలోని జైపూర్ మండలం ముదిగుంట గ్రామపంచాయతీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామీణ స్థాయి నుండి పారిశుద్ధ్య నిర్వహణ, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువల శుభ్రతను మరింత మెరుగుపరచాలని, ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని తెలిపారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను సందర్శించి, లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణ పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి అర్హులైన లబ్ధిదారులు సంక్షేమ ఫలాలు పొందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ బియ్యం, పెన్షన్ల వంటి సౌకర్యాలు అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. గ్రామాభివృద్ధికి అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని, సమస్యల పరిష్కారంపై అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, పంచాయతీ కార్యదర్శికి పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై పలు సూచనలు చేశారు. పన్నుల వసూలు, మురుగు కాలువ వ్యవస్థ శుభ్రత, వర్షపు నీటి సంరక్షణ వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు గ్రామపంచాయతీ సిబ్బందిని అభినందించారు.
ఈ రోజు *మన్ కీ బాత్* కార్యక్రమంలో దేశ ప్రధానమంత్రి ప్రశంసించిన గ్రామపంచాయతీలోని రూఫ్టాప్ రైన్వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాన్ని పరిశీలించారు. గ్రామంలో డ్రైనేజీల చివర కమ్యూనిటీ సోక్ పిట్స్ ఏర్పాటు చేసి నీటి సంరక్షణ చర్యలను బలోపేతం చేయాలని ఎం. పి. ఓ., ఎ. పి. ఓ., పంచాయితీ కార్యదర్శికి సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి బాపు, ఎ.పి.ఓ., డి.పి.ఎం. సర్పంచ్, వార్డు సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





