
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
శనివారం మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలో ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు,మౌలిక వసతులపై వివరాలు తెలుసుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించి, చిన్నారుల ఎత్తు,బరువు వివరాలను అడిగి తెలుసుకున్నారు.వారికి అందిస్తున్న పోషకాహారం, భోజన నాణ్యతపై సమీక్ష నిర్వహించారు.చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, సమతుల ఆహారం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. చిన్నారులకు మెరుగైన వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్, ఎంపీడీవో మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.





