జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట జిల్లాలో రెండు శిశువులకు అధికారికంగా దత్తత ఇవ్వడం జరిగింది. నాలుగు సంవత్సరాల బాబును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందిన దంపతులకు, ఆరు నెలల ఆడ శిశువును నిజామాబాద్ జిల్లాకు చెందిన దంపతులకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కే. హైమావతి చేతుల మీదుగా దత్తతగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ దత్తత తీసుకున్న తల్లిదండ్రులు పిల్లలను మంచి విద్యతో ఎదగేలా చూసుకోవాలని, వారి ఆసక్తులకు అనుగుణంగా ప్రోత్సహించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడం తల్లిదండ్రుల బాధ్యత అని తెలిపారు. అలాగే, పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకోవాలనుకుంటే సిద్దిపేటలోని శిశు గృహం లేదా జిల్లా బాలల పరిరక్షణ విభాగం ద్వారా అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని, తద్వారా ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తవని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సిహెచ్.శారద, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ మమత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి కె.రాము, శిశు గృహ మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు.





