విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
మంచిర్యాల జిల్లా ,మార్చి 22, 2026:
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని జన్నారం మండల కేంద్రంలో గల ఆశ్రమ పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి తరగతి గదులు, వంటశాల, భోజనశాల, నిత్యావసర సరుకుల నిల్వలు, మధ్యాహ్న భోజనం నాణ్యత, హాజరు పట్టికలు, వసతి గదులు, పరిసరాల పరిశుభ్రత పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు, ప్రహరీ గోడ ఇతర సదుపాయాలు కల్పించి విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పోషక విలువలతో కూడిన మెనూ అమలు చేయడం జరుగుతుందని, శుద్ధమైన త్రాగునీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన అందించడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరయ్యేలా పర్యవేక్షించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





