రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి దళితులకు అవకాశం కల్పించాలని లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొత్తపల్లి స్వామి కోరారు. తాను గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో విధేయుడిగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని తెలిపారు. 2004 సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ గ్రామ అధ్యక్షుడిగా కూడా సేవలు అందించినట్లు చెప్పారు. 2010 నుండి 2014 వరకు ఉమ్మడి దౌల్తాబాద్ మండలంలో ఎంఫీటీసీగా పనిచేసి లింగారెడ్డిపల్లి, చిన్నమాసాన్పల్లి, పెద్ద ఆరేపల్లి, చిన్న ఆరేపల్లి గ్రామాల ప్రజలకు సేవలు అందించినట్లు ఆయన తెలిపారు. అలాగే 2013 నుండి 2016 వరకు ఉమ్మడి దౌల్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షునిగా పనిచేసినట్లు పేర్కొన్నారు. 2018 నుండి 2020 వరకు రాయపోల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, 2020 నుండి 2023 వరకు మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. 2020 దుబ్బాక ఉపఎన్నికల సమయంలో రాష్ట్ర నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరుల ఆధ్వర్యంలో మండలంలో పార్టీ కోసం కీలకంగా పనిచేసినట్లు వివరించారు.
ప్రస్తుతం లింగారెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, బూత్ అధ్యక్షుడిగా కొనసాగుతూ రాయపోల్ మండలంలో సీనియర్ కార్యకర్తగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నానని తెలిపారు. నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ మరియు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని అన్నారు. కాబట్టి గత రెండు దశాబ్దాలుగా పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్న తనకు రాయపోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి అవకాశం ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని కొత్తపల్లి స్వామి విజ్ఞప్తి చేశారు.





