సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం రాంసాగర్ గ్రామంలో సోమవారం రామాలయం కమిటీ ఆధ్వర్యంలో కోటి తలంబ్రాల దీక్ష ఘనంగా నిర్వహించారు. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి సమర్పించే గోటి తలంబ్రాలను 108 కలశాలలో నింపి హనుమాన్ దేవాలయం నుండి రామాలయం వరకు బాజా బజంత్రిలతో, కాషాయ జెండాలతో భక్తి ర్యాలీ నిర్వహించారు.అనంతరం భక్తులు రామనామ స్మరణతో గోటిని ఓలిచి తలంబ్రాలుగా మార్చి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజుకు అందజేశారు. భద్రాచలం సీతారాముల కళ్యాణానికి తెలంగాణ నుండి నాలుగోసారి మూడు క్వింటాళ్ల గోటి తలంబ్రాలు అందిస్తున్నామని రామరాజు తెలిపారు. ఈ సందర్భంగా రామాలయం కమిటీ సభ్యులు రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.





