వ్యాయామం ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ,మార్చి 15, 2026 :
వ్యాయామం, శారీరక శ్రమ ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోని శ్రీ ఉషోదయ పాఠశాల మైదానంలో ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన క్రీడా పోటీలలో భాగంగా నిర్వహించిన ఫైనల్ పోటీలలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఒక్కొక్కసారి నిర్ణీత పని వేళలను మించి పని చేయవలసి ఉంటుందని తెలిపారు. ఈ తరుణంలో రెవెన్యూ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించడంతో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని తెలిపారు. వ్యాయామం, యోగ, క్రీడలు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని తెలిపారు. కార్యాలయాలలో పని ఒత్తిడి దృష్ట్యా శారీరక శ్రమ లేకుండా పని చేయడంతో 40 సంవత్సరాల వయసుకే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉద్యోగులకు శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





