ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం పోరాటం చేస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మూడు దశాబ్దాలుగా సాగుతున్న ఉద్యమంలో అనేక మంది తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ ఉద్యమానికి మందకృష్ణ మాదిగ నాయకత్వం వహిస్తూ దీర్ఘకాలంగా పోరాటం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు అయ్యగల్ల రవి మాదిగ ఆధ్వర్యంలో అమరవీరులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మాదిగ అమరవీరులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారి ఆశయ సాధన కోసం ఉద్యమాన్ని మరింత బలంగా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ సర్పంచ్ రాజు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుర నర్సింలు మాదిగ, మండల ప్రధాన కార్యదర్శి మల్లేశం, నర్సింలు మాదిగ, కళాకారుడు స్వామి మాదిగ, కోశాధికారి లక్ష్మణ్ మాదిగ, కొత్తపల్లి స్వామి మాదిగ, వడ్డేపల్లి రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు.





