సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ పట్టణంలోని ఎయిర్టెల్ టవర్ (దౌల్తాబాద్ ప్రయాణ ప్రాంగణం) సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక వృద్ధురాలు పత్రి మల్లవ్వ (80) రోడ్డు దాటుతున్న సమయంలో TS 04 UB 9827 నంబర్ గల మినీ టాటా ఏస్ వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్ఐ అరుణ్ కుమార్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనను పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనతో మల్లవ్వ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రాత్రి వేళ వాహనాల వేగ నియంత్రణ లేకపోవడం, పాదచారుల భద్రతపై తగిన చర్యలు లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.





