పులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, జిల్లా అటవీశాఖ అధికారి పద్మజ రాణి క్షేత్రస్థాయిలో పరిశీలన
సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7
కోహెడ మండల పరిధిలోని సింగరాయ గుట్టల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, సిద్దిపేట్ లీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, జిల్లా అటవీశాఖ అధికారి పద్మజ రాణి క్షేత్రస్థాయిలో పర్యటించారు. పులి పాదముద్రలు కనిపించిన ప్రాంతాలను పులి సంచరిస్తున్న మార్గాలను పరిశీలించారు.పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, దానిని పట్టుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అటవీశాఖ అధికారి తెలిపారు. అటవీశాఖ సిబ్బంది నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు.ముఖ్యంగా కూరెళ్ల, శనిగరం, గుండారెడ్డిపల్లి, తంగళ్ళపల్లి గ్రామ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సిద్ధపేట సీపీ సూచించారు. పొలాలకు లేదా ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా వెళ్లకూడదని, ఎల్లప్పుడూ గుంపులుగా (కనీసం 5-6 మంది) మాత్రమే వెళ్లాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం పులి సంచారం ఉన్నందున అటవీ ప్రాంతంలోకి వెళ్లడం ప్రమాదకరమని, ప్రజలు అడవి లోపలికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని కోరారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ విజ్ఞప్తి చేశారు.





