మేయర్/ చైర్మన్ ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 2, 2026:
2వ సాధారణ మున్సిపల్ కార్పొరేషన్ / మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా మేయర్ / చైర్మన్ ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ రాణి కుముదిని అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి, ఇతర ఎన్నికల అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల లతో మున్సిపల్ ఎన్నికలలో భాగంగా మేయర్ / చైర్మన్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ 2వ సాధారణ మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నామినేషన్లు స్వీకరించడం జరిగిందని, అభ్యంతరాలు, ఉపసంహరణల అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను తయారు చేయడం జరుగుతుందని, వెంటనే గుర్తుల కేటాయింపు చేసి బ్యాలెట్ పేపర్లను ముద్రణకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.11వ తేదీన ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని,12 రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే), 13 వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అనంతరం మేయర్లు / చైర్మన్ల ఎంపిక ప్రక్రియ లో ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఇందులో భాగంగా ఎంపిక చేయబడిన అధికారులకు ఆన్లైన్ ద్వారా కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 4 మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణ అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడుతున్నామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం మేయర్ / చైర్మన్ ఎంపిక ప్రక్రియ నిబంధనల ప్రకారం చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు జశ్వంత్, రాజేంద్రప్రసాద్, మహేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





