రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘అరైవ్ అలైవ్’
సిద్దిపేట్ జిల్లా, జనవరి 30, తెలుగు న్యూస్ 24/7
రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ నిర్వహించిన సోషల్ మీడియా వీడియోల పోటీ విజేతలను శుక్రవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రకటించారు.కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు, పోటీలో పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. పోటీలో గెలుపొందిన మొదటి విడత మన సిద్దిపేట అడ్డా ఇన్స్టాగ్రామ్ పేజ్ , రెండో విడత ఫ్లాష్ ఫ్రేమ్35 విజేతలను అభినందించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాల ద్వారా ఒక సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చని, ముఖ్యంగా యువతను రోడ్డు భద్రతా నియమాలపై చైతన్యపరచడంలో ఈ వీడియోలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు కేవలం జరిమానాలు మాత్రమే పరిష్కారం కాదని, ప్రతి ఒక్కరిలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ పట్ల అవగాహన ఉండాలని సూచించారు. సామాజిక అంశాలపై అవగాహన కల్పించేందుకు యువత మరింత ఉత్సాహంగా ముందుకు రావాలని కమిషనర్ కోరారు. సమాజ హితం కోసం యువత తమ సృజనాత్మకతను ఉపయోగించడం శుభపరిణామమని అభినందించారు. నేటి కాలంలో షార్ట్ వీడియోలకు ఉన్న క్రేజ్ను గమనించి, వాటిని కేవలం వినోదానికే కాకుండా.. ప్రజల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి ఒక సాధనంగా మలుచుకోవాలని యువతకు సూచించారు.కేవలం రోడ్డు భద్రతకే పరిమితం కాకుండా, మాదక ద్రవ్యాల నిర్మూలన , మద్యపాన వ్యసనం వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాలు మరియు సమాజానికి పోలీస్ సేవలు వంటి అంశాలపై కూడా వినూత్నమైన వీడియోలు రూపొందించి ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఇన్స్పెక్టర్లు వాసుదేవరావు, ఉపేందర్, శ్రీధర్ గౌడ్, లక్ష్మీ బాబు, సబ్ ఇన్స్పెక్టర్ దామోదర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సాయి ప్రసాద్ సాయి చరణ్, సిబ్బంది పాల్గొన్నారు.





