వడ్డీ లేని రుణాల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క
మంచిర్యాల జిల్లా,జనవరి 19, 2026:
మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేక పథకాల ద్వారా చేయూత అందించడం జరుగుతుందని, ఈ క్రమంలో వడ్డీ లేని రుణాల పథకంలో భాగంగా పట్టణ మహిళా సంఘాల సభ్యులకు రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క అన్నారు. సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సెర్ప్ సి ఈ ఓ దివ్య దేవరాజన్ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మెప్మా అధికారులు, బ్యాంకు అధికారులతో వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు, అర్హులైన స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. మహిళ సంఘాలలో సభ్యులుగా లేని వారిని రేషన్ కార్డు ఆధారంగా గుర్తించాలని, పంపిణీ కార్యక్రమంలో రద్దీ లేకుండా చూడాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పట్టణ స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియ చేపడతామని, అధికారుల సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





