గ్రామాల సమగ్ర అభివృద్ధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు పూర్తి స్థాయిలో భాగస్వాములై పనిచేయాలని రాయపోల్ మండల స్పెషల్ ఆఫీసర్ బాబు నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, అధికారులు పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు నాణ్యమైన తాగునీటి సరఫరా అందించాలని తెలిపారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గ్రామాల్లో బోరు బావులు ఉన్నప్పటికీ సరైన నిర్వహణ లేకపోవడంతో నీటి సరఫరా అంతరాయం కలుగుతోందని, పైపులైన్లు, మోటార్లలో సాంకేతిక లోపాలు, పాతబడిన మౌలిక వసతులే ఇందుకు కారణమని అని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం ద్వారా కూడా నిరంతర నీటి సరఫరా జరగడం లేదని, పైపులైన్ లీకేజీలు, మోటార్లకు అవసరమైన మరమ్మతులు చేయకపోవడం వల్ల సమస్య మరింత పెరుగుతోందని తెలిపారు. ఇటీవల కొన్ని రోజులుగా ప్రజలు నీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకునే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ నెల 19వ తేదీలోగా పూర్తిస్థాయిలో నీటి సరఫరా పునరుద్ధరించాలని, పాడైన బోర్లు, మోటార్లు, పైపులైన్లను వెంటనే మరమ్మతులు చేయాలని తెలిపారు. అవసరమైతే అదనపు బోరు బావులు తవ్వించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చిలుముల శ్రీనివాస్, మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నరేష్, ఏపీవో రాములు, ఏపీఎం యాదగిరి, మిషన్ భగీరథ ఇంజినీర్ అభినయ్, అంగన్వాడీ సూపర్వైజర్ భానా, ఫీల్డ్ అసిస్టెంట్ రాము కుమార్ తదితరులు పాల్గొన్నారు.





