మత్స్యశాఖ సహకార సంఘాలకు అన్ని విధాలుగా చేయూత నిర్వహిస్తున్నట్లు రాయపోల్ ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నది ప్రభుత్వం అని మత్స్యశాఖ ఫీల్డ్ ఆఫీసర్ గౌతమి పేర్కొన్నారు. బుధవారం రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామంలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనాజీపూర్ సర్పంచ్ సోమని నిర్మల ఇస్తారి, మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షుడు నీల స్వామి, ఉపసర్పంచ్ వేణు, సంఘ ప్రతినిధులు జోడు కరుణాకర్, మంగిడిపల్లి వెంకటి, రమేష్, కనకయ్యలతో కలిసి చెరువులో చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అనాజీపూర్ పెద్ద చెరువులో 1,36,000 చేపపిల్లలు, తిమ్మక్కపల్లి చెరువులో 57,000 చేపపిల్లలు వదిలినట్లు తెలిపారు. మండలంలోని అన్ని చెరువుల్లో యుద్ధప్రాతిపదికన చేపపిల్లల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. చేపల పెంపకం ద్వారా మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెరిగి, వారి ఆదాయం మెరుగుపడుతుందని అధికారులు వివరించారు. మత్స్యకారులు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పూర్ణచందర్, మత్స్యశాఖ సహాయకులు వంశీ, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.





