నిర్మాణ పనులను వేగవంతం చేయాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
మంచిర్యాల జిల్లా, డిసెంబర్ 23, 2025:
ప్రభుత్వ విద్యా సంస్థలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని కాసిపేట మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పోషక విలువలు కలిగిన మెనూ అమలు చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో విద్యాలయంలో చేపట్టిన అదనపు గదుల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం మండలంలోని దేవాపూర్ లో గల ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి రిజిస్టర్లు, తరగతి గదులు, వంటశాల, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాలలో చేపట్టిన మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని, గుత్తేదారుల సమన్వయంతో త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





