సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసి జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కె.హేమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి జిల్లా కలెక్టర్ కె.హేమావతి జిల్లా అధికారులు, ఆర్డీవోలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షం కురుస్తున్నందున జిల్లాలోని అన్ని వాగుల వంకలలో వర్షం నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుందని, అదేవిధంగా వివిధ నీటిపారుదల ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు కూడా పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉన్నందున వాటి వద్ద ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. చెరువులు, కుంటలు పూర్తిగా నిండి కోతకు గురైతే నీటిని ఆపేందుకు ఇరిగేషన్ శాఖ వారు ఇసుక బత్తాలతో సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రమాదకరమైనలో లెవెల్ వంతెనలు, కాజ్వేల మీదుగా వరద నీరు ప్రవహిస్తే వాటి మీదుగా రవాణాను పూర్తిగా ఆపివేయాలని, చేపలు పట్టుటకు నీటి వనరుల వద్దకు వెళ్లకుండా మత్స్యకారులను, యువకులను అప్రమత్తం చేయాలని అన్నారు. పశువులను కాసేందుకు పశువులను కాపర్లు పొలాల వద్దకు రైతులు ప్రమాదకరమైన నీటి వనరుల నుండి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రమాదకరమైన విద్యుత్ స్తంభాలు, పాడబడ్డ ఇళ్ల వద్ద కు ప్రజలు వెళ్లకుండా చూడాలని అన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైన జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 08457 230000 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రజలు ఉపయోగించాలని సూచించారు. ఈ వీడియో సమావేశ జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, డివిజన్ అధికారులు, తాసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.





