ఎంపీ వంశీ గడ్డం కృషితో రామగిరి ఖిల్లాకు రోప్వే ఆమోదం
రామగిరి, తెలంగాణ:
రామగిరి ఖిల్లా పర్యాటకాభివృద్ధి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోప్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టు సాధనలో పలు స్థాయిల్లో నిరంతర కృషి చేసి, ప్రతిపాదనలు సమర్పించిన పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రధాన పాత్ర పోషించారు.
₹2.46 కోట్లు వ్యయంతో 2.1 కిలోమీటర్ల పొడవైన రోప్వే నిర్మాణం చేపడతారు. దీని ద్వారా కోట పాదాల నుండి కొండపై భాగానికి భక్తులు, పర్యాటకులు సులభంగా, సురక్షితంగా చేరుకోగలరు. అదనంగా, రామగిరి పరిసరాల్లో పర్యాటక అభివృద్ధికి మరో ₹2.5 కోట్లు కేటాయించబడ్డాయి.
ఈ సందర్భంగా ఎంపీ వంశీ మాట్లాడుతూ:
“ఇది చాలా కాలంగా సాగుతున్న పోరాటం. రామగిరి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరిస్తూ మౌలిక సదుపాయాల అవసరాన్ని పదేపదే ప్రతిపాదించాను. ఇప్పుడు ఆ కృషి ఫలించింది. రోప్వే వల్ల భక్తులు, పర్యాటకులకు సౌలభ్యం కలుగుతుంది. అదనంగా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు, చిన్న వ్యాపారాలకు ఆదాయం వస్తుంది. రామగిరి అభివృద్ధి దిశగా ఇది ఒక కొత్త అధ్యాయం.” అని అన్నారు.
ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే రామగిరి ఖిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందటమే కాకుండా, ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందనుంది.





