హైదరాబాద్: సొంతస్థలం ఉండి.. ఇంటిని నిర్మించుకునేందుకు ఆసక్తి చూపేవారికి మంచిరోజులు వచ్చాయి. గృహలక్ష్మి పేరిట రాష్ట్ర సర్కారు రూపొందించిన నూతన పథకం ఆగస్టు నుంచి పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించి స్థూల మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దశల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. దీని అమలుకు సంబంధించిన కార్యాచరణ విధానాలు ఖరారవ్వాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఏటా 4 లక్షల మందిని ఎంపికచేసి సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చేవారికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గం నుంచి 3 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఎంపికైన లబ్ధిదారులకు 3 దశల్లో ఆయా మొత్తాలను విడుదల చేసేందుకు నిర్ణయించింది.
*నెలాఖరుకు సిద్ధం*
గృహలక్ష్మి’ అమలుకు కార్యాచరణ విధానాలను రూపొందించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అందుకోసం అధికారులు కసరత్తు చేపట్టారు. ఏ ప్రభుత్వ పథకంలోనూ లబ్ధి పొందని వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10, బీసీ మైనార్టీలకు 50 శాతం ఇవ్వాలని సర్కారు స్పష్టం చేసింది. మిగిలిన 20 శాతాన్ని ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇవ్వనుంది. కార్యాచరణ విధానాల రూపకల్పనలో మున్సిపల్, పంచాయతీరాజ్, రహదారులు-భవనాల శాఖ ఉన్నతాధికారులను భాగస్వాములను చేయనుంది. ఈ ప్రక్రియను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో వారుఉన్నారు.
*ఆగస్టు నుంచి దరఖాస్తులు*
ఆగస్టు చివరివారం నుంచి లబ్ధిదారుల దరఖాస్తులను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు మంత్రిస్థాయిలో మథనం చేసి.. ముసాయిదా విధానాలను సీఎం కేసీఆర్కు ఉన్నతాధికారులు అందజేస్తారు. ఆయన సూచనల మేరకు మార్పులు చేశాక తుది ఉత్తర్వులు వెలువడతాయని సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 వేల మంది లబ్ధిదారులకు ఆర్థికసాయం అందచేయనున్నందున.. మిగిలిన దరఖాస్తుదారులను ప్రాధాన్యక్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యం ఇవనున్నట్లు తెలుస్తోంది. దరఖాస్తులు చేసుకునేందుకు తుది గడువును కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యాక ప్రకటించే అవకాశం ఉంది.





