బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా కుటుంబాలు సొంత ఊర్లకు బయలుదేరుతుంటారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఈ నెల 28 నుంచి కళాశాలలకు కూడా సెలవులు ఇవ్వనున్నారు. చాలా కుటుంబాలు తమ సొంత గ్రామాలకు చేరుకుంటారు. తిరిగి అక్టోబర్ 3 తర్వాత మాత్రమే తమ నివాసాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ ఖాళీ సమయంలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు జరిగే అవకాశం ఉందని రాయపోల్ ఎస్ఐ కె.మానస అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ “సెలవులు, పండగల సమయంలో సాధారణంగా దొంగలు ఖాళీ ఇళ్లను టార్గెట్ చేసి, ఊరికి బయలుదేరే ముందు పలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. బంగారు నగలు, నగదు ఇంట్లో ఉంచకూడదు. వాటిని బ్యాంక్ లాకర్లో లేదా నమ్మకం ఉన్నవారి వద్ద భద్రపరచాలి. వీలైతే వెంట తీసుకెళ్తే ఉత్తమం. ఇంటి ప్రధాన ద్వారం తాళం బయట కనిపించకుండా డోర్ కర్టెన్ ఏర్పాటు చేయాలి. సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్, సీసీ కెమెరాలు అమర్చుకుంటే మరింత భద్రత లభిస్తుంది. అల్మారాలు, బీరువాల తాళాలను సాధారణంగా కనిపించే ప్రదేశాల్లో కాకుండా రహస్య ప్రదేశాల్లో భద్రపరచాలి” అని పేర్కొన్నారు. అలాగే ఊరికి బయలుదేరేముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చి ఇంటి పరిస్థితిని గమనించమని చెప్పాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని పేర్కొన్నారు. రాబోయే పండగ రోజుల్లో పోలీసులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తే ఎటువంటి భద్రతా సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చని ఎస్ఐ మానస తెలియజేయడం జరిగింది.





